మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో 140 అడుగుల బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడు సుమిత్ మీనాను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. అయినప్పటికీ ఆ బాలుడి కథ విషాదాంతమైంది. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుణ జిల్లాలోని పిప్లియా గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమిత్ మీనా అనే బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న 140 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. బోరుబావికి కొంత దూరంలో గొయ్యి తీసి బాలుడిని కాపాడారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా.. అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. గుణ జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ, "బాలుడు రాత్రంతా చల్లటి వాతావరణంలో ఉండడం వల్ల చేతులు, కాళ్లు తడిచి వాచిపోయాయి. అల్పోష్ణస్థితి (కోర్ బాడీ టెంపరేచర్ 95 డిగ్రీల ఫారెన్హీట్ కంటే తక్కువగా పడిపోయినప్పుడు ఏర్పడే పరిస్థితి) కారణంగా శరీర భాగాలు స్తంభించిపోయాయి. మెరుగైన వైద్యం అందించినా సమయం మించిపోయినందున బాలుడిని కాపాడుకోలేకపోయాం'' అని తెలిపారు.
0 Comments