మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ పేరు ఖరారైంది. ఈ మేరకు బుధవారం జరిగిన భాజపా కోర్ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు 5న ఆయన మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపాయి. కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబయిలోని విధాన్ భవన్లో భాజపా శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారు చర్చించారు. అనంతరం భాజపా శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడణవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు ఆజాద్ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ సహా ఎన్డీయే కీలక నేతలు హాజరుకానున్నారు. సీఎంగా ఫడణవీస్తో పాటు శివసేన నేత ఏక్నాథ్ శిందే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
0 Comments