అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ రాణించినప్పటికీ మిగిలిన రంగాల షేర్లలో మాత్రం స్తబ్ధత నెలకొంది. నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేటి సాయంత్రం వెలువడనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించడం గమనార్హం. సెన్సెక్స్ ఉదయం 81,476.76 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,526.14) నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. కాసేపు లాభాల్లో కదలాడింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 81,211.64 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ. చివరికి 236.18 పాయింట్ల నష్టంతో 81,289.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.87గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఎల్అండ్టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.68 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
0 Comments