ఇప్పటి వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో హైడ్రా వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, హైడ్రా చేపట్టిన చర్యల వల్ల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఇప్పుడు కొత్తగా ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారంతా జాగ్రత్తగా ఉంటున్నారని తెలిపారు. ''ఇప్పటివరకు హైడ్రా 8 చెరువులు, 12 పార్కులను కాపాడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ఆర్ఎస్ఈతో కలిసి శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నాం. అలాగే, ఏరియల్ డ్రోన్ చిత్రాలను కూడా తీసుకుంటున్నాం. ప్రభుత్వ భూములపై జియోఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. 2000 నుండి 2024 వరకు చెరువులపై ఉన్న చిత్రాలు సేకరిస్తున్నాం. ఇప్పటివరకు హైడ్రాకు 5,800 ఫిర్యాదులు వచ్చాయి. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్తో కలిసి పని చేస్తున్నాం. మున్సిపాలిటీలలో అనధికార నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కేవలం కూల్చడానికి మాత్రమే అని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల రక్షణే హైడ్రా ముఖ్యమైన కర్తవ్యం అని ఆయన చెప్పారు. భూముల రక్షణతో పాటు వరద నివారణ చర్యలు కూడా చేపడతామని అన్నారు. హైడ్రాకు డాప్లర్ రాడార్ అందించేందుకు ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించారు. డాప్లర్ రాడార్ ఉంటే కచ్చితమైన వాతావరణ అంచనాలు పొందగలుగుతామని చెప్పారు. అలాగే, హైడ్రా తరఫున త్వరలో ఒక ఎఫ్ఎమ్ ఛానెల్ ప్రారంభించాలని కూడా ఆయన తెలిపారు. ఈ ఛానెల్ ద్వారా ప్రజలకు సమయానుకూలంగా వాతావరణ సమాచారం అందించవచ్చని అన్నారు.
0 Comments