Ad Code

తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న పెంగల్ తుఫాన్ ?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై పడింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాల వల్ల తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవును సైతం ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి ఇదివరకే ఫెంగల్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఆగ్నేయ దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి శ్రీలంకలోని ట్రింకోమలి- 240, తమిళనాడులోని నాగపట్నం- 330, పుదుచ్చేరి- 390, చెన్నై- 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శ్రీలంకలోని ట్రింకోమలికి ఆగ్నేయ దిశగా 190, తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయం- తూర్పు ఆగ్నేయ దిశగా 470, పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా 580, చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu