ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు, చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు, విలేజ్ మ్యాప్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ ''అమీన్పూర్ చెరువు తూములు మూసివేయడం వల్లే లేఅవుట్లు మునిగాయి. ఎఫ్టీఎల్ లెవెల్ పరిగణనలోకి తీసుకొని చెరువులు సర్వే చేయిస్తాం. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసింది. అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు పెద్దవాళ్లవైనా, పేదలవైనా కూల్చక తప్పదు. కొంతమందిపై చర్యలు తీసుకోవడం వల్లే హైడ్రా చేసే పని అందరికీ తెలిసింది. ప్రజల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చింది.. దీనిపై చర్చ కూడా జరుగుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనుసును చంపుకొని పని చేయాల్సి వస్తోంది. ఎఫ్టీఎల్ పరిధి నిర్ధరించాక ఏదైనా నిర్మాణం చేపడితే అలర్ట్ వస్తుంది. అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఇప్పటివరకు ఎన్నో ఆక్రమణలు జరిగాయి, ఇకపై అలా జరగకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశం. హైడ్రా పనితీరు కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. చెరువులు ఆక్రమణకు గురికాకుండా స్థానికులు కూడా నిఘా పెడుతున్నారు'' అని రంగనాథ్ తెలిపారు.
0 Comments