పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. సాధారణ పౌరులకు నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య, సాధారణ బీమా ప్రీమియంలపై జీఎస్టీ విధించే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం శనివారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలను మినహాయించాలన్న చర్చ జరిగింది. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు రూ.5 లక్షల వరకు తీసుకునే ఆరోగ్య బీమాపై జీఎస్టీ నుంచి మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు. రూ.5 లక్షల కవరేజీ దాటితే 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. సీనియర్ సిటిజన్లకు మాత్రం కవరేజీతో సంబంధం లేకుండా.. జీఎస్టీ నుంచి మినహాయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో మంత్రివర్గ సహచరుల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైందని బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి తెలిపారు. బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్ల వేళ గత నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ అంశంపై మరింత లోతుగా చర్చించేందుకు 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. సామ్రాట్ చౌదరిని కన్వీనర్గా నియమించారు. ఇందులో ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, గుజరాత్ తదితర రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఈ నెలాఖరుకు కౌన్సిల్కు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
0 Comments