Ad Code

జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు అంశంపై మంత్రుల బృందం ఏర్పాటు !


ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ అయిన 54వ జీఎస్టీ మండలి.. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే భేటీలో క్యాన్సర్‌ ఔషధాలపై, స్నాక్స్‌పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం వెలువడింది. కౌన్సిల్‌ సమావేశం అనంతరం సమావేశం వివరాలను విలేకరుల సమావేశంలో మంత్రి వెల్లడించారు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ ఈ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించింది. బీహార్‌ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌధరి నేతృత్వంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందానికే ఈ బాధ్యతనూ కట్టబెట్టంది. కొంతమంది కొత్త సభ్యులు ఈ బృందంలో చేరతారని, అక్టోబర్‌ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీనిపై నవంబర్‌లో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. క్యాన్సర్‌ ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. స్నాక్స్‌పై 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీని తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2026 మార్చి తర్వాత జీఎస్టీ పరిహార సెస్సు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపైనా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్టీ అంశాలపైనా చర్చించినట్లు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu