ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను రూ 4 వేలకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా ముఖ్యమంత్రి మరో అడుగు వేసారు. అదే సమయంలో అనర్హుల పెన్షన్లు తొలిగించాలని నిర్ణయించారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ 4 వేలు పెన్షన్ అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయనున్నారు. సామాజిక భద్రతా పింఛన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరు పేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం 60 ఏళ్లు, ఆ పై వారికి సామాజిక పెన్షన్లు అందుతున్నాయి. ఎన్నికల హామీ అమల్లో భాగంగా 50 ఏళ్లకే పింఛను మంజూరు చేసే అంశంపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మద్య ఉన్న వారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వారికి పింఛను అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఇందు కోసం అధికారులు మంత్రులకు బాధ్యతలు కేటాయించారు. తదుపరి సమావేశంలో మార్గదర్శకాలు సిద్దం చేసి అమలు దిశగా ముందుకు వెళ్దామని సూచించారు. పలువురు అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా వీరి లెక్కలను ప్రభుత్వం సేకరించింది. అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వీరికి నవంబర్ నుంచి కోత వేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ స్థానంలో కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, వీరి పెన్షన్లు కోత వేసే సమయంలోనే మరోసారి వారి అర్హత గురించి వివరాలు సేకరిస్తున్నారు. దసరా తరువాత ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు, అనర్హులకు కోత పైన కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
0 Comments