వినేశ్‌ ఫోగట్‌ అనర్హత అంశంపై పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళన !


పారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అనర్హత అంశంపై పార్లమెంట్‌లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనపై విపక్షాలు అభ్యంతరం చెబుతూ సభ నుంచి వాకౌట్‌ చేశాయి. వినేశ్‌ ఫోగట్‌ అనర్హతపై కేం‍ద్రమంత్రి మాట్లాడుతూ 'అనర్హత అంశంలో తగు చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషాను ప్రధాని మోడీ ఆదేశించారు. ఈరోజు ఆమె బరువు 50 కిలోలు 100 గ్రాములు ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు పడింది. భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఐఓఏ ప్రెసిడెంట్‌ పీటీ ఉష పారిస్‌లో ఉన్నారు. ప్రధాని మోడీ ఆమెతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు'అని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం ఆమెకు వ్యక్తిగత సిబ్బందితో సహా ప్రతి సౌకర్యాన్ని అందించిందని చెప్పారు. మరోవైపు క్రీడామంత్రి వివరణ ఇస్తున్న సమయంలో ఈ అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. అనంతరం నిరసనలు తెలుపుతూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశాయి. పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేష్ ఫోగట్‌ అనర్హత వేటుపై న్యాయం చేయాలని కోరుతూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌ వెలుపల నిరసన చేపట్టారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org